Saturday, August 21, 2010

భూమికి నక్షత్రాలకు మధ్య దూరాన్ని ఎలా లెక్కిస్తారు?,Measuring distance between Earth and Stars



ప్రశ్న : భూమికి నక్షత్రాలకు మధ్య దూరాన్ని ఎలా లెక్కిస్తారు?

జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ కక్ష్య వ్యాసం 300 మిలియన్‌ కిలోమీటర్లు. అంటే 30 కోట్ల కిలోమీటర్లు. దూరం కనుక్కోవలసిన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు భూమిపై ఒక ప్రదేశం నుంచి టెలిస్కోపు ద్వారా ముందుగా పరిశీలిస్తారు. ఆ నక్షత్రం నుంచి వెలువడే కాంతి కిరణాలు కంటితో చేసే కోణాన్ని కనుగొంటారు. దీన్ని దృష్టికోణం అంటారు. దీన్ని నమోదు చేసుకున్న తర్వాత ఆరునెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 12 నెలల కాలం పడుతుందని తెలుసుగా? ఆరునెలల తర్వాత భూమి తన కక్ష్యలో మొదటి స్థానం నుంచి సరిగ్గా వ్యతిరేక స్థానంలోకి చేరుకుంటుంది. అప్పుడు మళ్లీ టెలిస్కోపులో ఆ నక్షత్రాన్ని పరిశీలించి తిరిగి దృష్టికోణాన్ని కనుగొంటారు. భూమి మొదటి స్థానం, ఆరునెలల తర్వాత ఉన్న స్థానం, నక్షత్రం ఉండే స్థానాలను మూడు బిందువులనుకుంటే, ఈ మూడింటి మధ్య ఒక వూహా త్రిభుజం ఏర్పడుతుంది. ఈ త్రిభుజంలో భూమి రెండు స్థానాల మధ్య దూరం 30 కోట్ల కిలోమీటర్లని (భూకక్ష్య వ్యాసం) మనకు తెలుసు. అలాగే రెండు దృష్టికోణాలు కూడా నమోదయ్యాయి. నక్షత్రం నుంచి కాంతి ప్రయాణించే వేగం కూడా తెలుసు. ఈ కొలతలను త్రికోణమితి (Trigonometry) సూత్రంలో ప్రతిక్షేపిస్తే భూమికి, నక్షత్రానికి మధ్య దూరం ఎంతో తెలిసిపోతుంది. ఈ పద్ధతిలో భూమి నుంచి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల దూరాన్ని లెక్కించవచ్చు. మరో పద్ధతిలో నక్షత్రాల నుంచి వెలువడే కాంతిని వర్ణమాపకం (spectrometer)లో అమర్చి ఉండే పట్టకం (prism) గుండా ప్రసరింపజేసి తద్వారా ఏర్పడే వర్ణపటం (spectrum)లో రంగుల తీవ్రతలను బట్టి కూడా నక్షత్రాల దూరాలను లెక్కిస్తారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...