Friday, July 04, 2014

అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్ర : అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?
జ : యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి.  అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట.  అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్”  – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

- by నాగవరపు రవీంద్ర@http://sampradayam.wordpress.com/
  •  ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...